Top Ad unit 728 × 90

కాసుల గలగల.. గంగ బిరబిర..

The bullet news(river)-  రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి రంగానికి గత ఏడాది కన్నా అదనంగా కేటాయింపులు చేయడంతో జిల్లా సాగునీటి రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందనే ఆశలు జిల్లా రైతుల్లో రేకెత్తుతున్నాయి. సాగునీటి రంగానికి రూ.16,978.23 వేల కోట్ల మేర కేటాయించారు. గత ఏడాది సాగునీటి రంగానికి 12,770.26 కోట్లను కేటాయించగా.. ఈసారి 32.95 శాతం అదనంగా పెంచడం విశేషం. ఫలితంగా జిల్లా సాగునీటి రంగానికి ఎంతో మేలు జరుగుతుందని జిల్లాలో రైతులు ఎంతో ఆశాభావంతో ఉన్నారు.                                                          జిల్లాలో ప్రధానంగా సంగం, నెల్లూరు బ్యారేజీలకు తొలి ప్రాధాన్యం దక్కనుంది. ఈ రెండు బ్యారేజీలు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమున్న వనరులుగా గుర్తింపు పొందాయి. పోలవరంతో సమానంగా ప్రభుత్వం వీటిపై దృష్టిసారించింది. 2015లో వీటి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడంతో వేగం పుంజుకున్నాయి. నెల్లూరు బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరగా.. సంగం బ్యారేజీ పనులు మాత్రం 70 శాతం దాటాయి.

వ్యయం, బకాయిలు
ప్రస్తుతం సంగం బ్యారేజీ నిర్మాణ పనుల్లో వ్యయం పెరిగింది. గుత్త సంస్థ ఈ వ్యయం విషయంలో ప్రభుత్వంతో చర్చలు చేపట్టింది. ఉక్కు ధరలు పెరిగాయి. దాంతో తమకు వ్యయం పెరుగుతుందని గుత్త సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. ఇటీవల తెలుగుగంగ చీఫ్‌ ఇంజినీరు మురళీనాథ్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇదేవిదంగా ఇక్కడ గుత్తేదారుకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి సమస్యలకు బడ్జెట్‌
రూపంలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం నెలకొంది.

భూసేకరణ సమస్యకు పరిష్కారం : నెల్లూరు బ్యారేజీకి చెందిన పొర్లుకట్టల నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదు. భూసేకరణ సమస్య ఇందుకు ఆటంకంగా మారింది. బడ్జెట్లో కేటాయింపులు జరిగితే భూసేకరణ సమస్య తొలగిపోతుంది. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం సంపూర్ణ నిర్మాణం సాకారమవుతుంది.

సోమశిల నీరు రాళ్లపాడుకు : సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు చెరువుకు సోమశిల జలాలు చేరేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికి ఈ పథకం నత్తనడకన సాగుతోంది. మెట్ట ప్రాంతంలో సాగునీరు ఎండమావిగా మారింది. బడ్జెట్లో గత ఏడాదికన్నా నిధుల కేటాయింపులు పెరిగినందున ఈ పథకానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

సోమశిల హైలెవల్‌ పథకం : సోమశిల హైలెవల్‌ పథకం ప్రధానంగా మెట్ట ప్రాంతాలకు ఉద్దేశించిన పథకం. అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, ఆత్మకూరు మండలాలకు మేలు జరుగుతుంది. ఈ పథకం పనులు సాగుతున్నాయి. నిధుల లభ్యత సమస్యగా ఉంది. బడ్జెట్‌ ద్వారా ఈ పథకానికి నిధుల కేటాయింపు పెరిగితే ఈ పథకం ద్వారా సోమశిల జలాలు మెట్ట ప్రాంతాల్లోనూ పంటలకు ప్రాణాధారమవుతాయి.

సోమశిల, స్వర్ణముఖి కాలువ : సోమశిల స్వర్ణముఖి కాలువ పథకం నిధుల లభ్యత కారణంగా నిరుపయోగంగా ఉంది. అటవీ భూముల సేకరణ సమస్యతో పాటు నిధుల కొరత ఈ పథకాన్ని పట్టిపీడిస్తుంది. బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపునకు అవకాశం కలుగుతుంది.

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరుకు ప్రయోజనం : మెట్ట ప్రాంతంలో మరో అద్భుత పథకం పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌. వరికుంటపాడు మండలంలోని ఈ రిజర్వాయర్‌ పనులు ఇప్పటికి మట్టి గట్టుకు పరిమితమయ్యాయి. ఈ పనులే నేటికీ పూర్తికాలేదు బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు ప్రయోజనం లభిస్తుందనే ఆశలు అన్నదాతల్లో నెలకొన్నాయి.

తెలుగు గంగ పథకాలకు : తెలుగు గంగ పథకానికి చెందిన పలు రకాల పనులకు బడ్జెట్‌ కేటాయింపులతో ఉపయోగముండే అవకాశాలున్నాయి. తెలుగుగంగ జలాశయం ద్వారా ఇప్పటికే కండలేరు ఆధారంగా ఎత్తిపోతల పథకం రైతులకు ప్రయోజకరంగా మారింది. తెలుగుగంగ పథకంలో భాగంగా పలు ఉపకాలువల అభివృద్ధికి బడ్జెట్‌ద్వారా మేలు జరుగుతుందని రైతులు ఆశతో ఉన్నారు. సోమశిల దక్షిణ కాలువ, సోమశిల- స్వర్ణముఖి లింకు కాలువ 12వ ప్యాకేజీకి మేలు జరిగే అవకాశాలున్నాయి. ఫలితంగా 52 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుంది.
కాసుల గలగల.. గంగ బిరబిర.. Reviewed by ADMIN on March 09, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.