రూ.1492 కోట్ల వార్షిక బడ్జెట్టుకు సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
The bullet news ( Nellore) _ నగర పాలక సంస్థ 2018-19 వార్షిక బడ్జెట్టులో విద్యకు తొలిప్రాధాన్యం కల్పిస్తూ అన్ని మున్సిపల్ పాఠశాల్లో అడ్వాన్సుకెరీర్ ఫౌండేషన్ తరగతులూ, నూతన గదుల నిర్మాణం, మౌలిక వసతులు, మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాలు, అధునాతన లాబరేటరీలను ఏర్పాటు చేస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. కార్పోరేషను కార్యాలయంలో వార్షిక బడ్జెట్టు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ప్రతిపాదిత బడ్జెట్టు తీర్మానాన్ని టిడిపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జెడ్ శివప్రసాద్ సభలో ప్రవేశపెట్టగా మేయరు అధ్యక్షతన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం మేయరు విలేఖరులతో మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రూ.32 కోట్ల కార్పోరేషను నిధులతో పాటు రూ.25కోట్ల కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ నిధులను వెచ్చిస్తున్నామని తెలిపారు. గత ఏడాది బడ్జెట్టు రూ.1084 కోట్ల నిధుల్లో రూ.1004 కోట్లను వినియోగించి దాదాపు 93శాతం నిధులను ఖర్చు చేసిన ఘనత నెల్లూరు కార్పోరేషనుకు దక్కుతుందని మేయరు వెల్లడించారు. సురక్షిత మంచినీటి పధకాలకు రూ.701 కోట్ల నిధులను కేటాయించామనీ, అందులో రూ.150 కోట్లతో నగర వ్యాప్తంగా ఉన్న మంచినీటి పాత పైపులను తొలగించి నూతన పైపులను అమర్చుతామని ఆయన వివరించారు. భూగర్భ పనుల్లో భాగంగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు రూ.150 కోట్లు, అమృత్ పధకం ద్వారా మరో రూ.63కోట్లను మంజూరు చేశామనీ, నగరంలోని అన్ని వీధుల్లో సిమెంటు రోడ్ల నిర్మాణాలు చేపడుతామని మేయరు తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలపై నూతనంగా ఎలాంటి పన్నుల భారాన్ని మోపబోమనీ, ఒక్క రూపాయి కూడా పెంచే ప్రసక్తే లేదని మేయరు స్పష్టం చేసారు. అదేవిధంగా నగరంలోని 25 ప్రధాన పార్కుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ, రూ. 11 కోట్లతో మరో నలభై పార్కుల నిర్మాణాలు చేపడుతున్నామని మేయరు ప్రకటించారు. నగరంలోని రజకుల సంక్షేమానికీ, దోభీ ఘాట్ల నిర్మాణాలకు రూ.2కోట్లు, వీధి విద్యుత్ దీపాలకు రూ.6.5 కోట్లు, స్మశాన వాటికల అభివృద్ధి పనులకు రూ.5కోట్లు, షాదీ మంజిల్, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రూ.8కోట్లు, ప్రసూతి వైద్యశాల, యునానీ ఆసుపత్రుల నిర్మాణాలకు రూ.3 కోట్లు వంతున బడ్జెట్టులో కేటాయించామని మేయరు వివరించారు. బ్రాహ్మణవర్గ విద్యార్ధుల ఆగమ శాస్త్ర పునఃచరణ తరగతుల నిర్వహణకు ప్రత్యేకంగా కోటి రూపాయలను మంజూరు చేసామని ఆయన తెలిపారు. నగర వ్యాప్తంగా తొలుత 10 కాలనీలలో ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, అదేవిధంగా ఐదు రూపాయలకే భోజనం అందించే 10 అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నామని మేయరు ప్రకటించారు. పందుల బెడదను నివారించేందుకు దూరంగా ఉన్న శివారు ప్రాంతాల్లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించి పెంపక కేంద్రం నిర్మాణాన్ని చేపడుతామనీ, నగరంలోని అన్ని పందులను అక్కడికి తరలిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉండిన వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణల సహకారంతో నెల్లూరు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలుస్తుందని మేయరు ఆకాంక్షించారు. రూ.1492 కోట్ల వార్షిక బడ్జెట్టును ఆమోదించి, నగారాభివృద్ధికి తోడ్పడుతున్న సభ్యులందరికీ మేయరు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కమీషనరు అలీం బాషా, డిప్యూటి మేయరు ముక్కాల ద్వారకా నాథ్, ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్, అన్ని శాఖల అధికారులూ, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
రూ.1492 కోట్ల వార్షిక బడ్జెట్టుకు సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
Reviewed by ADMIN
on
March 29, 2018
Rating:
No comments: