Top Ad unit 728 × 90

రామదాసుకండ్రిగలో ఆగని భూఆక్రమణలు

The bullet news(venkatachalm)- : భూ మాయగాళ్లకు అడ్డాగా మారిన వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగలో భూ ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజేఎఫ్‌ఎస్‌ భూములకు పట్టాలు.. పాసుపుస్తకాలను ఇప్పించే పేరుతో రైతుల వద్ద నుంచి అక్రమ వసూళ్లు.. బోటు భూముల్లో పేర్లు మార్పు వివాదం.. కృష్ణపట్నం పోర్టు రోడ్డు పరిహారం స్వాహాల పర్వం ఇప్పటికే బయట పడగా.. తాజాగా సోమవారం కొందరు రైతులు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న మహిళా వీఆర్వో పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ వీఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు వెళ్లి రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..

వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంచాయతీ పరిధిలోని నాయుడుపాళెం చెరువు సమీపంలో ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని ప్రస్తుతం ఎవరూ సాగు చేయటం లేదు. దాంతో అందులో అడవి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. బీడుగా ఉన్న ఆ భూమిలోకి సోమవారం సుమారు పది మంది రైతులు జేసీబీ యంత్రాన్ని తీసుకువచ్చి మొక్కలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన వీఆర్‌ఏ తహసీల్దార్‌ సోమ్లా నాయక్‌కు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ వీఆర్వో రవిదర్శిణి, సర్వేయర్‌ సుబ్బరాయుడులు సంఘటన  స్థలానికి వెళ్లి భూ ఆక్రమణను అడ్డుకున్నారు. ఆ భూమిలో మొక్కలు తీసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఇవి సీజేఎఫ్‌ఎస్‌ భూములని, తమకు ప్రభుత్వం కేటాయించిందని లబ్ధిదారులు వీఆర్వోకు చెప్పారు. ప్రస్తుతం రెవెన్యూ దస్త్రాల్లో ఎవరి పేర్లు ఉన్నాయో పరిశీలించాలని, అప్పటి వరకు పనులు నిలిపి వేయాలని కోరారు. అందుకు అంగీకరించని ఆక్రమణదారులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దురుసుగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన వీఆర్వో తహసీల్దార్‌కు జరిగిన విషయం చెప్పి వాపోయారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ సోమ్లానాయక్‌ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆక్రమణలను నిలిపి వేయాలని సూచించారు. దీంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి వెళ్లి అధికారులు, ఆక్రమణదారులతో మాట్లాడారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆక్రమణదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారిణితో ఇష్టారీతిగా మాట్లాడిన ఆక్రమణదారులు వెంటనే రాజకీయ నాయకులను ఆశ్రయించారు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు 30ఏళ్ల కిందట ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చిందని చెబుతున్న ఆక్రమణదారులు ఇప్పటి వరకు ఎందుకు సాగు చేసుకోలేదని రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమిని కూడా ఆక్రమించి పట్టాలు చేయించుకునేందుకు తెర వెనుక నాయకులు ఉండి నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంకటాచలం మండలంలో వరుసగా వెలుగు చూస్తున్న అక్రమాలను ఎలా అట్టడి చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.                                                        ఆక్రమించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వ భూములను 2010లోనే ఏపీఐఐసీకి కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది. నిజంగా ఆక్రమణదారుల స్వాధీనంలో ఉంటే ఎందుకు సాగు చేయటం లేదు. వీఆర్వో పట్ల దురుసుగా ప్రవర్తించటం దారుణం. వారిపై వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను  ఆక్రమిస్తే చర్యలు తప్పవు.
రామదాసుకండ్రిగలో ఆగని భూఆక్రమణలు Reviewed by ADMIN on March 06, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.