Top Ad unit 728 × 90

నేతా ..మజాకా...!

The bullet news(nellore)-  మూలాపేటలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలం. నగరపాలక సంస్థ చేతుల్లో  45 ఏళ్లుగా ఉంది. రికార్డులు అలాగే సూచిస్తున్నాయి. ఇంత విలువైన స్థలాన్ని ఒక ప్రైవేటు పాఠశాల. నగరపాలక సంస్థకు పైసా అద్దె చెల్లించకుండా అప్పనంగా వినియోగించుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి.

మరో విచిత్రం ఏంటో తెలుసా? ఖాళీ స్థలం కబ్జాకు గురవుతుందని.. దీని పరిక్షణ కోసం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీనికోసం నగరపాలక సంస్థ నిధుల నుంచి రూ.3.25 లక్షల మొత్తన్ని విడుదల చేశారు. అందుకు అనుగుణంగా 4, ఆగస్టు, 2016లో అప్పటి కమిషనర్‌ పనులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం పనులు నిర్వహించారు. ప్రహరీ స్థలానికి నాలుగు వైపులా నిర్మించాల్సి ఉంది. మూడు వైపులా   మాత్రమే నిర్మించి.. పాఠశాల వైపు మాత్రం వదిలేశారు. దీంతో పాఠశాల విద్యార్థులకు అది క్రీడామైదానంగా మారింది.

నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని చిన్న ఇల్లు కట్టుకోటానికి ఎవరైనా ఆక్రమిస్తే.. క్షణాల్లో ఆక్రమణల నిర్మూలన పేరుతో తొలగించే దాకా అధికారులు ఊరుకోరు. అలాంటిది రూ.కోటి విలువైన స్థలాన్ని ఒక ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు దర్జాగా అనుభవిస్తుంటే కన్నెత్తి చూడరు. పోనీ, దాని ద్వారా ఏటా ఎంతో కొంత నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందేమో? అనుకుంటే అదీ లేదు.  కారణం ప్రైవేటు పాఠశాల ఒక నేతకు చెందినది కావటమే. ఇదీ అసలు రహస్యం. నగరం నడిబొడ్డున. 40వ డివిజన్‌ మూలాపేట ఆనుకుని ఉన్న నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలం ఇది. కార్పొరేషన్‌ రికార్డుల ప్రకారం 90 అంకణాల స్థలం ఉంటుంది. గతంలో ఇక్కడ మార్కెట్‌ నిర్వహించారు. కాలక్రమేణా మార్కెట్‌ తరలిపోయింది. దీంతో అప్పటి నుంచి స్థలం వృథాగా ఉంది. ప్రధాన రహదారి ఆనుకుని. వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండటంతో కబ్జా చేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. దీన్ని గుర్తించి విలువైన స్థలాన్ని కాపాడాలని అధికారులు భావించారు. దీనికోసం కార్పొరేషన్‌ నిధులు రూ.3.25 లక్షలు వెచ్చించి ప్రహరీ  నిర్మాణానికి పనులను మంజూరు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. విలువైన స్థలం కార్పొరేషన్‌ చేతుల్లో ఉంటుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ, ప్రస్తుతం స్థలాన్ని చూడండి. ఒక నేత పాఠశాల అనుకుని ఉండటంతో కార్పొరేషన్‌ నిధులతో కట్టించిన ప్రహరీ గోడ మధ్య క్రీడా పరికరాలను ఏర్పాటు చేసుకుని వినియోగించుకుంటున్నాడు. అధికార పార్టీకి చెందిన నేత కావటంతో అధికారులు ఎవరూ అడ్డు చెప్పే సాహసం చేయటం లేదు.

రూ.కోట్ల విలువైన స్థలం
మూలాపేట పరిధిలో అంకణం ఎలా లేదన్నా రూ.లక్ష పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలకు క్రీడా మైదానంగా మారిన స్థలం సుమారు 90 అంకణాల వరకు ఉంది. అంటే సుమారు రూ.కోటి విలువైన స్థలం. దీన్ని కాపాడుకోటానికి నిర్మించిన ప్రహరీగోడకు ఖరీదైన రంగులు.. వాటిపై నాయకుల చిత్రపటాలు వేశారు. లోపల చూస్తే స్థలం మొత్తం సిమెంటుతో చదును చేసి.. అందులో చిన్న పిల్లలు ఆడుకోటానికి క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు. విలువైన స్థలం కాస్తా ప్రైవేటు పాఠశాలకు క్రీడా మైదానంగా మారిపోయింది. ప్రహరీకి పర్యవేక్షణ కోసం సీసీ కెమేరాలను కూడా పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది. దాదాపు పాఠశాలకు సంబంధించిన స్థలం అనే భావన వచ్చే విధంగా చేశారు.

నగరపాలక సంస్థ స్థలాలు కబ్జా జరుగుతుంటే అధికారులు కళ్లు మూసుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2014లో నగరపాలక సంస్థ స్థలాలకు సంబంధించి సర్వే చేయించారు. 171 ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధికారుల దగ్గర జాబితా తీసుకుని పరిశీలిస్తే 140 మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి 31 స్థలాలు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉంది.
నేతా ..మజాకా...! Reviewed by ADMIN on March 06, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.