జాతీయ రహదారుల దిగ్బంధం నేడు
The bullet news(highway)- రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ గురువారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 నుంచి 12 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల్ని దిగ్బంధించి, నిరసన తెలియజేయనుంది. తెదేపాతో పాటు, వైకాపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదా సాధన సమితి విజ్ఞప్తి మేరకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ‘సాధికార మిత్ర’ల సదస్సులో తెలిపారు. బుధవారం రాత్రి మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కాలవ శ్రీనివాసులుతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం తెదేపా శ్రేణులు జాతీయ రహదారుల పక్కన షామియానాలు వేసుకుని, శాంతియుత సంఘీభావం తెలియజేయాలని ఆదేశించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఎవరు గళం విప్పినా మా నైతిక మద్దతు ఉంటుంది. ప్రతిపక్షాలు సహా ఎవరు ఆందోళనలు చేసినా సహకరిస్తాం. ఆందోళనలు శాంతియుతంగా జరగాలి. రాష్ట్రాభివృద్ధికి విఘాతంగా మారకూడదు. జపాన్ తరహాలో నల్లబ్యాడ్జీలు ధరించి ఐదారు గంటలు అదనంగా పనిచేద్దాం. నిరాహార దీక్షలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం కళా వెంకటరావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దిల్లీలో తెదేపా ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోను ప్రధాన కూడళ్లలో తెదేపా శ్రేణులు బైఠాయించాలని, నిరసన సభలు, శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ‘‘గతంలో రాష్ట్ర బంద్ శాంతియుతంగా నిర్వహించాం. అదే స్ఫూర్తితో శాంతియుతంగా ఆందోళనలు జరపాలి. వైకాపాతో కలసి పాల్గొంటే విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా ప్రజాందోళనలు నిర్వహించాలి. నిరసన సభలు జరపాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల్ని చైతన్యపరచాలి’’ అని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగని సమయంలో రహదారుల దిగ్బంధం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగని సమయంలో రహదారుల దిగ్బంధం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జాతీయ రహదారుల దిగ్బంధం నేడు
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: