Top Ad unit 728 × 90

సీఎం సీక్రెట్ సర్వేలో టాపర్స్ వీరే..

THE BULLET NEWS (VIJAYAWADA)-సీఎం రహస్య పరీక్షలో జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ కొట్టేశారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా, ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్ష (సర్వే) ఫలితాలను గురువారం ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం మార్కులతో నెం.1 స్థానంలో నిలిచారు. ఆయన తరువాత స్థానంలో 70 శాతం పైబడిన మార్కులతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలకు 60 శాతం మార్కులే వచ్చాయి.

టీడీపీ అధ్యక్షుడు నిర్వహించిన పరీక్షలో జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ట్రాప్‌గ్రేడ్‌లో ఉంటే.. కొందరు 50 నుంచి 60 శాతం మార్కులు పొందారు. మంత్రులు 60 శాతం సాధించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయించి.. గురువారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫలితాలను వెల్లడించారు. ‘మూడు నెలలకొకసారి సమాచారం తెప్పించుకుంటానని కార్యకర్తల మనోభావాలను గమనించాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలని’ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు.

నెల్లూరులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ సాధించారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇవి. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పని తీరును అంచనా వేయడానికి ఐదు ప్రశ్నలను తయారు చేసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఒక్కో ప్రశ్నకు 70 శాతం దాటిన వారికి టాప్‌ గ్రేడ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? కార్యకర్తలకు అందు బాటులో ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతున్నారా? నియోజకవర్గంలోని నాయకులందరిని సమన్వయంతో కలుపుకెళ్తున్నారా లేదా? సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నారా? అనే ఐదు ప్రశ్నలకు కార్యకర్తల నుంచి సమాధానాలు సేకరించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఫోన్లు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడి

ఈ సర్వే ఫలితాలను గురువారం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌కు జిల్లా ఎమ్మెల్యేలందరిలో అత్యధిక మార్కులు లభించి నెం.1 స్థానంలో నిలిచారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో వంశీకి 79.66 శాతం మార్కులు వచ్చాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలో 74.86 శాతం, సమస్యల పరిష్కారంలో 76.9 శాతం, సమన్వయంతో అందరినీ కలుపుకువెళ్లే విషయంలో 76.98 శాతం, ఎమ్మెల్యే పని తీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో 70.2 శాతం మార్కులు వచ్చాయి. ఎమ్మెల్యే వంశీమోహన్‌ ఐదు ప్రశ్నల్లో పార్టీ అధ్యక్షుడు పెట్టిన 70 శాతం మార్కును అధిగమించారు. ఆయన తరువాత స్థానంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఉన్నారు. నాలుగు ప్రశ్నలలో ఆయన 70 శాతం దాటారు.

కార్యకర్తలతో సంబంధాల విషయంలో మాత్రం 69.07 శాతం మార్కులు వచ్చాయి. మిగిలిన అన్నిటిలోనూ సగటున 72 శాతం వచ్చింది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు కూడా ఒక ప్రశ్నలో మార్కులు కాస్త తగ్గాయి. కార్యకర్తలతో సంబంధాల విషయంలో ఆయనకు 66.75 శాతం మార్కులు లభించాయి. మిగిలిన నాలుగు ప్రశ్నలకు 70.54, 70.89, 73.88, 72.12 శాతం చొప్పున వచ్చాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు కూడా కార్యకర్తలతో సంబంధాల ప్రశ్నకు 68.71 శాతం వచ్చాయి. మిగిలిన ప్రశ్నలకు 74.56, 72.31, 73.34, 72.03 శాతం చొప్పున మార్కులు వచ్చాయి. 70 శాతం పైన వచ్చిన వారి మార్కులను మాత్రమే సమావేశంలో చంద్రబాబు చదివి వినిపించారు.

కార్యకర్తల పరీక్ష పాస్‌ కావాల్సిందే

ఇలాంటి పరీక్షలు తరచూ ఉంటాయని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల పని తీరుపై తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌నే వారి ముందు ఉంచామని సమావేశంలో చెప్పారు. కార్యకర్తల పరీక్షలో పాస్‌ కాకపోతే మళ్లీ పాస్‌ కావలసిందేనని సుతిమెత్తగా చెప్పారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా ఒక్కొసారి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను గ్రహించి ఎమ్మెల్యేల పని తీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రతి మూడు నెలల కొకసారి ఈ సమాచారం తెప్పిస్తానని, అలాగే ప్రజలు, అంతర్గతంగా వచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరిస్తామని చెప్పారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అన్ని విషయాలు సరిచేసుకోవాలన్నారు. ‘మేము చేసేవి మేం చేస్తాం, మీరు చేసేవి మీరు చేయండి. ఇద్దరం కలిసి ముందుకు వెళదాం’ అని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలకు చక్కని సేవలు అందించాలన్నారు. ఏవైనా లోటు పాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సూచనల ద్వారా తెలియజేస్తామని చెప్పారు.

8 మంత్రులు@ 60

జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్రకు సగటున 60 శాతం మార్కులే వచ్చాయి. మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరికి 50 నుంచి 60 శాతంలోపు వచ్చాయి. ఊహించని విధంగా కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి గ్రేడ్‌లు ప్రకటించడంతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. ‘మేమూ సైకిళ్లు బాగానే తొక్కుతున్నాం, నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాం... అందరిని పలకరిస్తున్నాం. మరి ఎక్కడ దెబ్బ కొట్టిందా’’ అని ఎమ్మెల్యేలు ఆత్మావలోకనంలో పడ్డారు.
సీఎం సీక్రెట్ సర్వేలో టాపర్స్ వీరే.. Reviewed by ADMIN on May 12, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.