క్షుద్రపూజలకు గుడ్లగూబ!
The bullet news(hyderabad)-మానవత్వం మరిచి కళ్లు పొడిచేసిన వైనం! అరుదైన ఈగల్ ఓల్ను రక్షించిన ప్రాణిమిత్ర ప్రతినిధులు హైదరాబాద్: మానవత్వం మరుగున పడిపోయిందనడానికి ఇదో ఉదాహరణ. మూఢ నమ్మకాల మూర్ఖత్వానికి ఇదో ప్రతీక... నోరులేని పశుపక్ష్యాదుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే సంఘటన... చాలా అరుదైన ఇండియన్ ఈగల్ ఓల్(గుడ్ల గూబ) కళ్లను పొడిచేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నగరంలోని ట్యాంక్బండ్ సమీపంలోని డీబీఆర్ బస్స్టాప్లో ఓ అరుదైన, భారీ పక్షి ఉన్నట్లు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్థానికులు భారతీయ ప్రాణిమిత్ర సంఘ్ ప్రతినిధులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ప్రాణిమిత్ర సంఘ్ సభ్యులు గిరిధర్గోపాల్ భారీ పక్షిని అరుదైన ఇండియన్ ఈగల్ ఓల్గా గుర్తించారు. కీకారణ్యాలు, మానవ సంచారం లేని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన గుడ్లగూబ కళ్లు పొడిచేసిన స్థితిలో కనిపించింది. పసుపు, కుంకుమలను చల్లి, నిమ్మకాయలను కట్టి వదిలిపెట్టారు. ఈ గుడ్లగూబ కళ్లను పూర్తిగా కోల్పోయింది. క్షుద్రపూజల కోసం ఈ పక్షిని వినియోగించినట్లు గుర్తించిన ప్రాణిమిత్ర సభ్యులు పక్షికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జూపార్క్ అధికారులకు అందజేశారు. సుమారు రెండు కిలోల బరువున్న ఈ గుడ్లగూబ చాలా అరుదైనదని తెలిపారు. ఈ తరహా గుడ్లగూబలను రహస్యంగా నగరంలోని ముర్గీచౌక్ ప్రాంతంలో రూ.లక్ష పైచిలుకు ధరలకు విక్రయిస్తుంటారని తెలిసింది. ఎవరో ఇలా కొనుగోలుచేసి క్షుద్రపూజలకు వినియోగించినట్లు సమాచారం.
క్షుద్రపూజలకు గుడ్లగూబ!
Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: