రజకుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం.. మేయర్ అజీజ్
The bullet news ( Nellore) _ నగర ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తున్న రజక వృత్తిదారుల అభ్యున్నతికి కార్పోరేషను బడ్జెట్టులో రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రత్యేక సంక్షేమ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బడ్జెట్టులో నిధుల కేటాయింపును హర్షిస్తూ రజక సంఘాల నాయకులు హరనాధపురంలోని మేయరు నివాసంలో ఆదివారం ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ చేతివృత్తి ఆధారిత కార్మికుల జీవితాల్లో మార్పు అవసరమనీ, టిడిపి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రజకుల సంక్షేమం సాధ్యమని ప్రకటించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో మధ్యతరగతి కుటుంబాలలో సైతం వాషింగ్ మెషీను అత్యంత సాధారణ గృహోపకరణంగా మారి రజకవృత్తి కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాలంతో పాటు అన్ని చేతి వృత్తులూ మార్పులు పొందుతూ అభివృద్ధి దిశగా సాగుతున్నాయనీ, రజకులు సైతం అధునాతన యంత్రాలతో లాండ్రీల నిర్వహణ చేసేందుకు ఆలోచన చెయ్యాలని మేయరు సూచించారు. బిసి కార్పోరేషను అధికారులతో మాట్లాడి బ్యాంకులతో ఏమాత్రం సంబంధం లేకుండా నగర పాలక సంస్థ నుంచి నేరుగా రజకులకు సంక్షేమ రుణాలను మంజూరు చేస్తామనీ, తొలివిడతగా వంద ఇస్త్రీ బండ్లను అందించేందుకు ప్రయత్నిస్తామని మేయరు హామీ ఇచ్చారు. రజకుల జీవన స్థాయిని పెంచేందుకు అవసరమైన అధునాతన స్థాయి ధోభీఘాట్ల నిర్మాణం, నాణ్యమైన ఇస్త్రీ బండ్లు, లాండ్రీలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే నెల్లూరు రజకుల అభివృద్ధిని నమూనాగా చూపుతామని మేయరు సంకల్పించారు. హాస్టళ్ళు, ఆసుపత్రులు, హోటళ్ళకు అవసరమైన లాండ్రీ సేవలను అందించేందుకు నగరంలోని రజకులకు అవకాశాలు కల్పిస్తామని మేయరు ప్రకటించారు. రజకులంతా ఐక్యంగా ఉండి సామాజిక వర్గ సమస్యలనూ, పరిష్కార సూచనలను అందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డిల దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ, రజకులు లత, మాధవి, పద్మమ్మ, రామయ్య, మదన్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య, సుధా, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
రజకుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం.. మేయర్ అజీజ్
Reviewed by ADMIN
on
April 01, 2018
Rating:
No comments: