Top Ad unit 728 × 90

లేఖల యుద్ధం...

THE BULLET NEWS (VIJAYAWADA)-టీడీపీ, బీజేపీ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరికి ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాము చెప్పదల్చుకున్నది లేఖల్లో వివరిస్తున్నారు. చంద్రబాబుకు లేఖకు సమాధానంగా అమిత్‌షా  మరో లేఖ రాశారు. మరోవైపు  అమిత్‌షా ఏమాత్రం అవగాహన లేకుండా  లేఖ రాశారని ఏపీ మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు.

నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్ధం నడిచింది. ప్రత్యేకహోదాపై ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఏపీకి అన్నీ చేశామని బీజేపీ నేతలు చెబితే... నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేశారని టీడీపీ నేతలు దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు మాటల యుద్ధానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పడింది. రొటీన్‌ అనుకున్నారేమో ఇరుపార్టీల నేతలు రూట్‌ మార్చారు. ఒకరికొకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.

ఎన్డీయే నుంచి విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తు ఇంతకుముందే ఏపీ సీఎం చంద్రబాబు అమిత్‌షాకు లేఖ రాశారు. ఆ లేఖలో ఎన్డీయే నుంచి బయటకు రావడానికి గల కారణాలు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వివరించారు. అయితే చంద్రబాబు లేఖకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగినట్టుగా లేఖలో పేర్కొన్నారు.  చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని  లేఖలో దుయ్యబట్టారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున చేపట్టిన అనేక కార్యక్రమాలను, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను అమిత్‌షా తన 9 పేజీల లేఖలో వివరించారు. ఏపీకి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని అమిత్‌షా లేఖలో తెలిపారు. ఏపీ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించిందని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిస్థాయిలో నెరవేర్చిందని వెల్లడించారు. టీడీపీకి, ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన మిత్రుడని తెలిపారు. ఏపీకి ఇచ్చిన విద్యాసంస్థలు, ఎయిమ్స్‌, ఇతరత్రా అంశాలు, విభజనచట్టంలోని అంశాలను అమిత్‌షా లేఖలో ప్రస్తావించారు. మూడు ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చినట్టు తెలిపారు.  అమరావతిలో రైల్‌రోడ్‌ నిర్మాణానికి, 180 కిలోమీటర్ల రింగ్‌రోడ్డుకు  నిధుల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు లేఖలో స్పష్టం చేశారు. యూపీఏ సర్కార్‌తో పోల్చితే.. ఎన్డీఏ రెట్టింపులు నిధులు ఇచ్చిందని తెలిపారు.  నిధుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు.  కొత్త రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చామన్నారు.

అమిత్‌షా రాసిన లేఖకు  ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. అమిత్‌షా అవగాహన లేకుండా లేఖ రాశారన్నారు.  ఇప్పటి వరకు జరిగిన అన్ని పనులకు సంబంధించిన యూసీలు కేంద్రానికి అందజేశామని తెలిపారు.  యూసీ సర్టిఫికెట్‌కు... ప్రత్యేకహోదాకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం ఆవేశపూరిత నిర్ణయంకాదన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేకసార్లు ప్రధాని దృష్టికి చంద్రబాబు  తీసుకెళ్లారని గుర్తు చేశారు.  త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో అమిత్‌షాకు లేఖ రాయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 
లేఖల యుద్ధం... Reviewed by ADMIN on March 25, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.