'దెయ్యంతో ఓ రాత్రి' సినిమా క్లాప్ కొట్టిన మేయరు
The bullet news (Nellore)- ప్రజలకు ప్రధాన వినోదంగా ఉన్న సినిమా రంగం కొంతమంది పెద్దల కనుసన్నల్లో నడుస్తోందనీ, ఔత్సాహిక కళాకారులు నటిస్తున్న చిన్న చిత్రాలను ఆదరించి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలోని ఫన్ పార్కు ప్రాంగణంలో 'దెయ్యంతో ఓ రాత్రి' సినిమా షూటింగును సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు నగర మేయరు అబ్దుల్ అజీజ్ హాజరై చిత్ర ప్రారంభాన్ని సూచిస్తూ క్లాప్ కొట్టిన అనంతరం ముహూర్తపు షాటును చిత్రీకరించారు. ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ వినూత్నమైన హారర్ కధతో బేబీ చైత్ర సమర్పణలో ఆరాధ్యా ప్రొడక్షన్సు వారి రెండవ చిత్రంగా నెల్లూరు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లోనే పూర్తి చిత్ర నిర్మాణం జరిగేలా నిర్మాత సంకల్పించారని వెల్లడించారు. సుందర గ్రామీణ ప్రాంత ప్రదేశాలు కలిగిన కావలి, బుచ్చిరెడ్డిపాలెం, రాపూరులాంటి ఇతర ప్రాంతాల్లో నేటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చిత్రనిర్మాణ సిబ్బంది సంసిద్ధులయ్యారని మేయరు ప్రకటించారు. ఇదే ప్రొడక్షన్ హౌస్ ద్వారా తొలుతగా చిత్రీకరించిన 'దెయ్యం చెప్పిన కథ' చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తున్నారనీ, సరికొత్త కధాంశంతో ప్రేక్షకుల ముందుకు త్వరలో వస్తున్న ఆ చిత్రాన్ని ఆదరించి నెల్లూరు సినీ అభిమానులంతా చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సినీరంగంలో నైపుణ్యం ఉన్న కళాకారులూ, సాంకేతిక నిపుణులూ, నిర్మాతలకు ప్రోత్సాహం, అవకాశం దొరికినప్పుడే వినోదరంగ అభివృద్ధి సాధ్యమని మేయరు స్పష్టం చేసారు. కార్యక్రమంలో భాగంగా చిత్రనిర్మాణ నిపుణులకూ, నూతన నటీనటులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభించాలని మేయరు ఆకాంక్షిస్తూ బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దయాకర్ రెడ్డి, దర్శకులు ప్రదీప్ రాజ్, టిడిపి నాయకులు షంషుద్దీన్, జాకీర్, సాబీర్ ఖాన్, ఉమర్, చిత్ర నిర్మాణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
'దెయ్యంతో ఓ రాత్రి' సినిమా క్లాప్ కొట్టిన మేయరు
Reviewed by ADMIN
on
April 02, 2018
Rating:
No comments: