అంబేద్కర్...సదా స్మరణీయుడు...
బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించినంత కాలం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జీవించారు. వెలివాడల్లోని దళితులకు సముచిత స్ధానాన్ని కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం, తన ప్రతిపాదనలను వైరివర్గానికి సహేతుకంగా వివరించేందుకు నిద్రను త్యాగం చేశాడు. మానవుని కళ్లు విజ్ఞానపు వాకిళ్లని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్ తరాలు చరిత్రను పుక్కిట పట్టాల్సిన అవసరాన్ని తన రచనల్లో నొక్కి చెప్పారు. పీడితవర్గాలు ప్రగతి పథంలో నడవాలంటే కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలని అంబేద్కర్ ఆశించాడు. అయితే పోరాటాల ద్వారానే ఇది సాధ్యపడుతుందని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాధికారమే పీడిత, వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం, రాజ్యాధికారం లేకుండా దళితుల అభివృద్ధి అసంభవం, అసాధ్యం అని చెప్పిన మహిళల అభివృద్ధి కోసం తపించారు. ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి చేయాలనే లక్ష్యంతోనే హిందూకోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. అయితే ఆనాటి సనాతన, సాంప్రదాయ అగ్రకుల పాలకులు హిందుకోడ్ బిల్లుకు అడ్డుపడ్డారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన భారతరత్న అంబేద్కర్.
మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నింటికి కారణం. అందుకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ క్రూరత్వం కంటే నీచత్వమే హీనమైనదన్నారు. కులం, మతం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కాని నిర్మించలేరనే నిజాన్ని నిర్భయంగా చెప్పారు. అందుకే అంబేడ్కర్ కులరహిత సమాజాన్ని కాంక్షించేవారికి అనుసరణీయుడు.. సదా స్మరణీయుడు.
No comments: